లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్ర రాజకీయ ఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరుతున్నారు. మరోవైపు ఎస్పీలోని కొందరు నేతలు తమకు టికెట్ నిరాకరించడంపై నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యకర్త ఠాకూర్ ఆదిత్య ఆత్మహత్యకు యత్నించారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. లక్నోలోని పార్టీ కార్యాలయం వెలుపల ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోబోయారు. గమనించిన మిగతా కార్యకర్తలు, పోలీసులు అతడి చర్యను అడ్డుకున్నారు.
కాగా, తాను గత 5 సంవత్సరాలుగా అలీఘఢ్లోని 74 నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేశానని ఎస్పీ కార్యకర్త ఠాకూర్ ఆదిత్య తెలిపారు. అయితే తనకు పార్టీ టికెట్ నిరాకరించారని, దీంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెప్పారు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాని మీడియాతో అన్నారు.
మరోవైపు పార్టీ టికెట్ రానందుకు ఒక బీఎస్పీ నేత ఇటీవల బోరున ఏడ్వడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరుగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన బెదిరించారు.