మమ్మల్ని ఆకాశానికెత్తే ట్వీట్లే ఉండాలి..
మమ్మల్ని మెచ్చుకొనే వార్తలే రాయాలి..
మా వ్యతిరేకుల పోస్టులను బ్లాక్ చెయ్యాలి..
మేం అడిగిన యూజర్ల వివరాలు ఇవ్వాలి..
మోదీ సర్కారు తీరిది!
ట్విట్టర్పై పెత్తనమిది!!
ట్విట్టర్ ఉంది కదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఏ ట్వీట్లు పడితే ఆ ట్వీట్లు చేస్తున్నారా? అలా కుదరదంటే కుదరదు. మీరు చేసే ట్వీట్ కచ్చితంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు నచ్చాలి. నచ్చలేదో! మీ ఖాతానే బ్లాక్ చేయిస్తుంది. అవసరమైతే మీ వివరాలు సేకరిస్తుంది. భావస్వేచ్ఛను తామెలా అడ్డుకొంటామని ట్విట్టర్ అనడానికీ వీల్లేకుండా చేస్తుంది. ప్రభుత్వ శాఖలు, కోర్టుల ద్వారా ఆదేశాలు జారీ చేయిస్తుంది. ట్విట్టరే స్వయంగా చెప్పిన వాస్తవమిది.
న్యూఢిల్లీ, జూలై 29: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్కు కేంద్రంలోని మోదీ సర్కారు ప్రపంచంలోనే అత్యధిక లీగల్ డిమాండ్లు చేసింది. కొందరు జర్నలిస్టులు, న్యూస్ చానెళ్లు, పత్రికలు చేసే కంటెంట్ను బ్లాక్ చేయాలని ఒత్తిడి తెచ్చింది. 2021 జూలై-డిసెంబర్ మధ్య ప్రపంచవ్యాప్తంగా తమకు 326 లీగల్ డిమాండ్లు రాగా, భారత ప్రభుత్వం నుంచే అత్యధికంగా 114 డిమాండ్లు వచ్చాయని ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా పారదర్శక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో.. గత ఏడాది జనవరి-జూన్ మధ్య కూడా కేంద్రం 89 లీగల్ డిమాండ్లు పంపినట్టు తెలిపింది. యూజర్ల సమాచారం ఇవ్వాలని కూడా భారత్ ఆదేశిస్తున్నదని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అలాంటివి 11,460 అభ్యర్థనలు రాగా, భారత్ నుంచే 2,211 అభ్యర్థనలు వచ్చాయని వివరించింది. అంతేకాదు.. ఈ ఆరు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ తొలగింపునకు 47,572 వినతులు అందగా, భారత్ నుంచే 3,992 అందాయని పేర్కొన్నది. గత మూడేండ్లలో ఎక్కువ లీగల్ డిమాండ్లు చేస్తున్న దేశాల్లో భారత్తో పాటు జపాన్, రష్యా, దక్షిణ కొరియా, టర్కీ ఉన్నాయని తెలిపింది. భారత్ విషయానికి వస్తే.. భారత అధికార వర్గాల నుంచి నిరంతరం యూజర్ల వివరాలు, కంటెంట్ బ్లాకింగ్ సంబంధిత ఆదేశాలు వస్తున్నాయని ట్విట్టర్ వెల్లడించింది.
“కొన్ని ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్ చేయాలంటూ కేంద్ర ఐటీ శాఖ తరచూ ఆర్డర్లు జారీ చేస్తున్నది. రాజకీయ, మీడియా సంబంధిత వెబ్సైట్ లింక్లను కూడా తొలగించాలని చెప్తున్నది. దీనివల్ల యూజర్ల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే అవుతుంది”
– కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్