లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడుత పోలింగ్ ఆదివారం ముగింది. ఈ దశలో వీవీఐపీ స్థానమైన కర్హల్లోనూ పోటింగ్ జరిగింది. బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడ్డారని, బోగస్ ఓట్లు వేశారని, బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన సాక్ష్యంగా దన్నహార్లోని బూత్ నంబర్ 110కి సంబంధించిన వీడియోను సైతం విడుదల చేశారు. బూత్ పరిధిలో చాలా మంది మహిళలను చాలా సేపు నిలబెట్టి ఓట్లు వేయించారని ఆరోపించారు. వివిధ మార్గాల్లో సమాజ్ వాదీ కార్యకర్తలు ఓట్ల రిగ్గింగ్కు పాల్పడ్డారన్నారు. పోలీసులను సైతం బెదిరింపులకు గురి చేసినట్లు పేర్కొన్నారు. చాలా మంది ఓటర్ల ఓట్లను ఎస్పీ కార్యకర్తలే వేశారని, పలువురిపై దాడి చేశారని బఘేల్ ఆరోపించారు. భయంతో చాలా మంది ఓటర్ల తమ ఓటుహక్కును వినియోగించుకోకపోయారన్నారు.
64 బూత్ల పరిధిలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఉత్తరప్రదేశ్ లక్నో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారికి పంపిన ఆయన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ తొలిసారిగా బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ను బీజేపీ రంగంలోకి దిపింది. బీఎస్పీ నుంచి కుల్దీప్ నారాయణ్ బరిలో ఉన్నారు.