Supreme Court | ఓటీటీ (Over The Top), ఇతర ప్లాట్ఫారమ్లను నియంత్రించేందుకు స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. కంటెంట్ను పర్యవేక్షించేందుకు, నియంత్రించడానికి స్వయంప్రతిపత్త సంస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర (Union Govt) ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు కోరారు. పిల్లో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్ ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ గురించి ప్రస్తావించారు. అయితే, ఈ వెబ్ సిరీస్పై పెద్ద ఎత్తున వివాదం చెలరగేడంతో పాటు నిషేధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యాయవాదులు శశాంక్ శేఖర్ ఝా, అపూర్వ అర్హతియ పిటిషన్లు దాఖలు చేశారు.
అసలైన కిడ్నాపర్ల తీవ్రవాద చర్యను తక్కువ చేసి, వారిని కీర్తించేందుకు ఇదో అసహ్యకరమైన ప్రయత్నమని.. 814 దుర్ఘటనను హాస్యాస్పదమైన కథనంగా మార్చడంతో పాటు ఉగ్రవాద క్రూరత్వాన్ని కప్పిపుచ్చి హిందూ సమాజాన్ని పరువు తీయడమే లక్ష్యంగా ఉగ్రవాద ఎజెండాను ప్రోత్సహించే ప్రయత్నం చేశారని పిటిషన్లో ఆరోపించారు. ఇది సినిమాటోగ్రాఫి చట్టం ప్రకారం సినిమాల పబ్లిక్ ఎగ్జిబిషన్ను నియంత్రించే బాధ్యతను అప్పగించిన చట్టబద్ధమైన ఫిల్మ్ సర్టిఫికేషన్ బాడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే ఉనికిలో ఉన్నాయని.. సినిమాటోగ్రాఫ్ చట్టం బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించబడే వాణిజ్య చిత్రాలకు కఠినమైన ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
అయితే, ఓటీటీ కంటెంట్ని పర్యవేక్షించేందుకు, నియంత్రణకు అలాంటి సంస్థలు అందుబాటులో లేవని తెలిపారు. స్వీయ నియంత్రణ పాటించేలా మార్గదర్శకాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, కుటుంబ ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి, రక్షణ మంత్రిత్వ శాఖ, టెలికం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియాలను పార్టీలుగా పిటిషన్లో చేర్చారు. ఓటీటీ ప్లాట్ఫారమ్లలో వీడియోలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ‘సెంట్రల్ బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఆన్లైన్ వీడియో కంటెంట్’ అనే స్వయంప్రతిపత్త సంస్థ, బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.