న్యూఢిల్లీ: కోవిడ్-19 డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ప్రాణాంతకమైనవని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మాజీ ప్రధాన శాస్త్రవేత్త రామన్ గంగాఖేద్కర్ స్పష్టం చేశారు. ఈ రెండు వేరియంట్లు అత్యంత వేగంగా వ్యాపిస్తాయని ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
డెల్టా వేరియంట్ ఒక సెల్ నుంచి మరో సెల్ బదిలీ అవుతుందని, మెదడులోకి వెళితే, చాలా నాడీ లక్షణాలు ఉన్న కణాలను ఉత్పత్తి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ దాడి చేసే అవయవాన్ని బట్టి.. శరీరంలో భారీ ఫాథోఫిజియాలజిక్ మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. విభిన్న అవయవాలపై దాడి చేస్తుందని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రేయెసెస్ కూడా భారత్లో తొలుత గుర్తించిన డెల్టా వేరియంట్ వైరస్ ప్రమాదకరమని హెచ్చరించారు. ఇప్పుడు 85 దేశాలకు వ్యాపించిందన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని పేర్కొన్నారు.
డెల్టా ప్లస్ వేరియంట్ కూడా ఆందోళనకరమైందనని టెడ్రోస్ అధానోమ్ ఘ్రెబ్రేయెసెస్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కాని ప్రాంతాలకు శరవేగంగా వ్యాప్తిస్తుందని హెచ్చరించారు.
డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను కట్టడి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎనిమిది రాష్ట్రాలను, ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అభ్యర్థించింది. జనాలు ఒకే చోట గుమిగూడకుండా నివారించడంతోపాటు విస్త్రుత స్థాయిలో పరీక్షలు జరుపాలని సూచించింది. డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగు చూసిన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.
ఈ మేరకు తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలతోపాటు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శుక్రవారం లేఖ రాశారు.