చెన్నై, ఆగస్టు 20 : తమిళనాడులో గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన దక్షిణ జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రులు లేవనెత్తిన కొన్ని కీలక అంశాల్లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), దక్షిణ రాష్ర్టాల రాజకీయ ప్రాతినిధ్య పరిరక్షణ, నీట్ పరీక్ష, కావేరీ జలాల పంపిణీ, అధిక ఆర్థిక స్వయంప్రతిపత్తి ఉన్నాయి. దక్షిణాది పార్లమెంటరీ బలాన్ని పరిరక్షించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒక అధికారిక తీర్మానాన్ని కోరగా, ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత తమ ప్రాంత రాజకీయ వాణికి ఎలాంటి భంగం కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నొక్కి చెప్పారు.
నదీ జలాల నిర్వహణ, రవాణా, లాజిస్టిక్స్, తీర ప్రాంత భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై మరింత సహకారం కోసం ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో కోరారు. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజయ్ కోరారు. నీటి అంశం మరో ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇందులో భాగంగా కర్ణాటక మేకేదాటు ప్రాజెక్టు విషయంలో సహకారాన్ని కోరగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించాలని ప్రతిపాదించారు.
సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి ప్రాధాన్యతలు, ప్రాంతీయ అభివృద్ధి విషయంలో దక్షిణ రాష్ర్టాల మధ్య మరింత సహకారం అవసరమని నొక్కి చెప్పారు. బలమైన భారతదేశ నిర్మాణానికి దోహదపడేలా రాష్ర్టాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దక్షిణ రాష్ర్టా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులతో మల్లు చర్చలు జరిపారు.