న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.4 డిగ్రీలుగా నమోదైందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే ఆకాశం మేఘావృతమై, పొగమంచు కమ్ముకొని ఉంటుందని పేర్కొంది. ఇవాళ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలకు చేరుకుంటుందని పేర్కొంది. గత గురువారం 8.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. తాజాగా 6.4 డిగ్రీలకు తగ్గింది. ఈ సీజన్లో ఇదే అత్యంత చలి రాత్రి అని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా గాలి నాణ్యత కాస్త మెరుగుపడి.. ‘పూర్’ కేటగిరికి చేరింది.
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కు చెందిన సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 256 నమోదైందని పేర్కొంది. ఐఐటీ ఢిల్లీ సమీపంలో 266, లోధి రోడ్లో 249గా రికార్డయినట్లు తెలిపింది. రాబోయే మూడు రోజులుగా ఢిల్లీలో గాలుల తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి గాలుల తీవ్రత కారణంగా గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ వివరించింది.