న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు చాలా ఫేమస్. అయితే ఆ మసీదులోకి మహిళల ఎంట్రీపై నిషేధం విధించారు. అమ్మాయిలు సింగిల్గా కానీ, గ్రూపులుగా కానీ మసీదులోకి రావొద్దు అని గేట్ల వద్ద నోటీసులు అతికించారు. దీంతో ఈ అంశంపై వివాదం చెలరేగుతోంది. జామా మసీదు షాహి ఇమామ్ స్పందిస్తూ.. ఆ నోటీసులు ప్రార్థనలు చేసే అమ్మాయిలకు వర్తించవన్నారు.
మహిళల ఎంట్రీపై నిషేధం విధించడం పట్ల కొన్ని మహిళా హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మసీదు నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదన్నాయి. జామా మసీదుకు ఉన్న మూడు గేట్ల వద్ద ఆ నోటీసులను అతికించారు. 17వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తులు నిర్మించిన మసీదుకు ప్రతి రోజు వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. మసీదు నిర్ణయాన్ని ఖండిస్తూ ఢిల్లీ మహిళా సంఘం జామా మసీదుకు నోటీసులు జారీ చేసింది.
షాహి ఇమాబ్ సయ్యిద్ అహ్మద్ బుకారి మాట్లాడుతూ మసీదు ఆవరణలో కొన్ని అభ్యంతరకర సంఘటనలు జరుగుతున్నాయన్నారు. జామా మసీదు ఓ ప్రార్థనా స్థలమని, ప్రార్థనల కోసం వచ్చేవారిని స్వాగతిస్తామని, కానీ డేటింగ్ కోసం ఒంటరిగా వచ్చే మహిళల్ని నిషేధిస్తున్నామన్నారు.