న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 1,934 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం నమోదైన 928 కేసుల కంటే ఇది రెట్టింపు. దీంతో పాజిటివిటీ రేటు 8.10 శాతానికి చేరింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,755కు, మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,27,394కు పెరిగింది. మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 26,242గా ఉంది.
కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. బుధవారం కంటే గురువారం కరోనా కేసులు 8 శాతం మేర పెరిగి 13,313గా నమోదయ్యాయి. ఫిబ్రవరి 25 తర్వాత మళ్లీ 13 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. కరోనా కేసుల నమోదు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్, బూస్టర్ డోసులను పెంచాలని సూచించారు.