న్యూఢిల్లీ : ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. ఢిల్లీలోని బాట్రా ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఆక్సిజన్ అయిపోయింది. ఇలా జరగడం వారంలో ఇది రెండోసారి. అయితే ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో.. సుమారు 80 నిమిషాల పాటు 230 మంది కరోనా రోగులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఇందులో ఒక డాక్టర్ తో పాటు పలువురు రోగులు మరణించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.
తమ విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 1:30 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్లు వచ్చాయి. ఆక్సిజన్ లేకుండా 230 మంది రోగులు.. ఒక గంట 20 నిమిషాల పాటు ఉన్నారని ఢిల్లీ కోర్టుకు బాట్రా ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరు మరణించలేదు కదా? అని కోర్టు ఆస్పత్రి యాజమాన్యాన్ని అడిగింది. ఇందుకు ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ.. ఆక్సిజన్ లేకపోవడంతో పలువురు మరణించారని, అందులో ఒక డాక్టర్ కూడా ఉన్నారని తెలిపింది. మొత్తం 307 మంది రోగుల్లో 230 మంది రోగులు ఆక్సిజన్ మీద ఆధారపడి చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.