న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజు గాలి నాణ్యత సూచీ (AQI) ‘చాలా పేలవమైన’ కేటగిరిలోనే ఉన్నది. అయితే, గాలి నాణ్యత సూచీ బుధవారం 379 ఉండగా.. గురువారం 362కు తగ్గింది. ఢిల్లీతో పాటు ఫరీదాబాద్లో 378, ఘజియాబాద్లో 361, గ్రేటర్ నోయిడా 362, గురుగ్రామ్ 344, నోయిడాలో ఏక్యూఐ 356గా నమోదైంది.
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అత్యవసర చర్యలను ప్రకటించిన ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్రాయ్ బుధవారం ప్రభుత్వ ఉద్యోగుల వంద శాతం ఇంటి నుంచే పని చేస్తారన్నారు. ఈ నెల 21 వరకు భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. అలాగే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బ్యూరోక్రసీ నిర్ణయాలు తీసుకోకుండా కోర్టులకే వదిలేస్తున్నారంటూ తప్పుపట్టింది.