Manish Sisodia – Satyendar Jain | ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇటీవల మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. ఢిల్లీ ఎల్జీ సక్సేనా ఆమోదం కోసం ఈ నెల 1న రాష్ట్రపతికి పంపారు. ఈ మేరకు రాజీనామాలను ఆమోదించినట్లు హోంశాఖ వెల్లడించింది. అదే సమయంలో కేబినెట్లోకి అతిషి, సౌరభ్ భరద్వాజ్లను తీసుకునేందుకు కేజ్రీవాల్ సర్కారుకు అనుమతి లభిచింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న సిసోడియాను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు అనుమతి తీసుకున్నది. ఈ క్రమంలో ఆయనను విచారించేందుకు తిహార్ జైలుకు చేరుకున్నది.
ఎక్సైజ్ పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలు-1లో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. జైలులో ఉన్న మనీష్ సిసోడియా ఉదయం ఆరు గంటల నుంచి తన దినచర్యను ప్రారంభించనున్నారు. ఉదయం ఆరు గంటలకు ఖైదీలందరినీ సెల్ నుంచి బయటకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఖైదీలను లెక్కిస్తారు. ఉదయం 7.30 గంటలకు జైలులో ఖైదీలకు టీ, స్నాక్స్ ఇస్తారు. 11 గంటలకు ఖైదీలకు ఆహారం అందిస్తారు. 12 నుంచి 3 గంటల వరకు ఖైదీలను బ్యారక్, వార్డు నుంచి అవసరమైన పనికి మినహా బయటకు రానివ్వరు. మరోసారి 3.30కి టీ, స్నాక్స్ ఇస్తారు. ఆ తర్వాత ఆరున్నర రాత్రి భోజనం ఇస్తారు. ఆ తర్వాత ఖైదీలను మరోసారి లెక్కిస్తారు. జైలు నిబంధనల ప్రకారం.. మనీష్ సిసోడియా సైతం ఇతర ఖైదీల మాదిరిగానే జీవించాల్సి రానున్నది.