న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నిందితుడికి స్థానికులు భారీ స్వాగతం పలికారు. 50 మంది మరణించి, 200 మందికిపైగా గాయపడిన ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైల్లో ఉన్న నిందితుడు షారుక్ పఠాన్కు కోర్టు సోమవారం కొన్ని గంటలు పెరోల్ మంజూరు చేసింది. ఆయన తండ్రికి మార్చిలో కరోనరీ యాంజియో ప్లాస్టీ శస్త్రచికిత్స జరిగింది. ఆ సమయంలో కోర్టు ఒక రోజు పెరోల్ ఇచ్చింది. అయితే సర్జరీ నేపథ్యంలో తండ్రిని అతడు కలవలేకపోయినట్లు షారుక్ పఠాన్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న తండ్రిని కలిసేందుకు పెరోల్ మంజూరు చేయాలని కోరారు.
దీంతో షారుక్ పఠాన్కు కోర్టు సోమవారం నాలుగు గంటలు పెరోల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్త్ మధ్య ఇంటికి వెళ్లిన అతడికి స్థానికులు భారీగా స్వాగతం పలికారు. చుట్టుపక్కల వారంతా ఆయన వెంట నడిచి వచ్చారు. పఠాన్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. పెరోల్ సమయం ముగిసిన అనంతరం అతడు జైలుకు తిరిగి వెళ్లాడు. కాగా, నిందితుడు షారుక్ పఠాన్కు స్థానికులు ఘన స్వాగతం పలికిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Accused Shahrukh Pathan, who pointed a gun at a policeman during anti-CAA protests gets a welcome during 4-hour parole on his arrival at his residence on May 23. He got parole to meet his ailing father.
(The viral video has been confirmed by police) pic.twitter.com/Fc5HjuSdy2
— ANI (@ANI) May 27, 2022