న్యూఢిల్లీ: రైలు ప్రమాదంలో ఓ పెయింటర్ తన రెండు చేతులను కోల్పోయాడు. జీవనాధారమైన పెయింటింగ్ బ్రష్ను పట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు మళ్లీ అతని పరిస్థితి మారింది. మరి కొన్ని రోజుల్లో అతను మళ్లీ పెయింటర్గా డ్యూటీ చేయనున్నాడు. ఎందుకంటే ఢిల్లీ డాక్టర్లు ఓ అద్భుతం సృష్టించారు. ఓ బ్రెయిన్ డెడ్ మహిళ ఇచ్చిన అవయవాలను అతనికి అమర్చారు. అతనికి రెండు చేతుల్ని మార్పిడి(Hand Transplantation) చేశారు. దీంతో మెడికల్ హిస్టరీలో ఇండియన్ డాక్టర్లు కొత్త చరిత్రను సృష్టించారు.
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి అతన్ని రేపు డిస్చార్జ్ చేయనున్నారు. 45 ఏళ్ల ఆ వ్యక్తి 2020లో జరిగిన రైలు ప్రమాదంలో చేతుల్ని కోల్పోయాడు. అయితే సౌత్ ఢిల్లీ స్కూల్లో పనిచేస్తున్న మీనా మెహతా ఇటీవల బ్రెయిన్ డెడ్ అయ్యింది. మరణానంతరం తన అవయవాలను దానం చేసేందుకు ఆమె ప్రతిజ్ఞ చేశారు. దాని ప్రకారమే ఆమె కిడ్నీ, లివర్, కార్నియాలను మరో ముగ్గురికి దానం చేశారు. ఇక ఆమె చేతులను ఢిల్లీ పెయింటర్కు ఫిక్స్ చేశారు.
ఈ సర్జరీలో గంగారామ్ ఆస్పత్రి డాక్టర్ల అద్భుత సర్జికల్ విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేం. సుమారు 12 గంటల పాటు డాక్టర్లు ఆ సర్జరీ చేశారు. డోనార్, రిసిపియంట్ చేతులకు చెందిన అన్ని నరాలు, కండరాలను కలిపారు. డాక్టర్లు పడ్డ శ్రమ ఫలించింది. సర్జరీ తర్వాత డాక్టర్లతో ఫోటో దిగిన సమయంలో ఆ పెయింటర్ తన చేతులతో థమ్స్ అప్ సంకేతం ఇస్తూ ఉత్సహాన్ని ప్రదర్శించారు.