న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. జ్యుడీషిల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్కు సోమవారం ఆక్సిజన్ స్థాయిలు తగ్గాయి. దీంతో ఆయనను లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్, కోల్కతాకు చెందిన షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 30న ఆయనను అరెస్ట్ చేసింది. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం ఈ నెల 13న కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు ఈ నెల 19న తిరస్కరించింది.
కాగా, 2017 ఆగస్ట్లో సత్యేందర్ జైన్, ఆయన కుటుంబంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అసలు వ్యాపారం నిర్వహించని నాలుగు షెల్ కంపెనీలను స్థాపించారని ఆరోపించింది. వీటి ద్వారా 2011-12లో రూ.11.78 కోట్లు, 2015-16లో రూ. 4.63 కోట్ల మేర మనీలాండరింగ్కు పాల్పడినట్లు కేసు నమోదు చేసింది. దీంతో సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది.