న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవడంతో కేంద్రంలోని మోదీ సర్కార్పై ఢిల్లీ ప్రభుత్వం శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ఇంధన సంక్షోభం వెనుక రాజకీయ మతలబు ఉందని, గతంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభం తరహాలో ఇది మానవతప్పిదంలా కనిపిస్తోందని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. మనకు అవసరమైన దానికంటే మూడున్నర రెట్లు అధికంగా ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నా మనం ఆ స్ధాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేకపోతున్నామని చెప్పారు.
ఉత్పాదక ప్లాంట్లు పూర్తిస్ధాయి సామర్ధ్యంతో నడవకపోయినా బొగ్గు కొరత ఉందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. తాము విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న వారు ఇవ్వాల్సిన విద్యుత్లో సగమే ఇస్తున్నారని చెప్పారు. ఢిల్లీకి సొంతంగా బొగ్గు ప్లాంట్లు లేవని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తాము కోరినంత విద్యుత్ సరఫరా లేకుంటే రాబోయే రెండు రోజుల్లో ఢిల్లీ అంతటా చీకట్లు ముసురుకుంటాయని జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎంత ఖరీదైనా వెనక్కి తగ్గకుండా విద్యుత్ను కొనుగోలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.