న్యూఢిల్లీ : దీపావళి పండుగ అంటే సందడి మామూలుగా ఉండదు. దీపాల వెలుగులతో బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లుతుంటుంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి పటాకులు పేలుస్తూ వేడుకల్లో పాలు పంచుకుంటుంటారు. అయితే, పండుగ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దీపావళి రోజున పటాకులు ఆరు నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ హెచ్చరించారు.
పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీపావళితో సహా వచ్చే ఏడాది ఒకటో తేదీ వరకు అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకాలు, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధిస్తూ సెప్టెంబర్లో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ సర్కారు గత రెండేళ్లుగా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నది. అయితే, ఈ నెల 21న ‘దియే జలావో.. పతాఖే నహీ’ (దివ్వెలు వెలిగించండి.. పటాకులు కాదు) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు గోపాల్రాయ్ తెలిపారు.
శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్కులో ఢిల్లీ ప్రభుత్వం 51వేల దీపాలను వెలిగించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో పటాకులు కొనుగోలు చేసి కాల్చితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నట్లు చెప్పారు. పటాకులపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను నియమించినట్లు గోపాల్రాయ్ పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో 210 బృందాలు, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 165, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో 33 బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 16 వరకు ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు 188 నమోదయ్యాయని, ఈ క్రమంలో 2,17 కిలోల బాణాసంచా సీజ్ చేసినట్లు వివరించారు. శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధానిని గాలి కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను రైతులు కాల్చివేస్తుండడంతో పొగ అంతా ఢిల్లీ వైపు చేరి.. గాలి కాలుష్యం పెరుగుతున్నది. దీనికి తోడు వాహనాల కాలుష్యం, మంచు కారణంగా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతున్నది.