న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ఆప్, బీజేపీ సభ్యుల నిరసనలతో సభ హోరెత్తింది. దీంతో ఎన్నిక నిర్వహించకుండానే ప్రిసైడింగ్ అధికారి (బీజేపీ కౌన్సిలర్) సత్య శర్మ సభను వాయిదా వేశారు. దీనిపై ఆప్ సభ్యులు నిరసనకు దిగారు. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభలోనే బైఠాయించి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే, ఎన్నికైన సభ్యులతో కాకుండా ఎల్జీ నామినేట్ చేసిన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి తొలుత ప్రమాణం చేయించడంపై ఆప్ సభ్యులు నిరసన తెలిపారు. సిగ్గుచేటు అంటూ నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభ 15 నిమిషాలు వాయిదా పడింది.
తిరిగి సభ ప్రారంభమైన వెంటనే.. కొందరు బీజేపీ సభ్యులు ఆప్ సభ్యుల వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో సభ నడపడం సాధ్యం కాదని పేర్కొంటూ ప్రిసైడింగ్ అధికారి సభను వాయిదా వేశారు. బీజేపీ ఓటమిని అంగీకరించి, ఎన్నిక సజావుగా సాగేలా సహకరించాలని ఆప్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా హితవు పలికారు. ‘ఆ పార్టీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారు. మొదట ఎన్నికలు జరపకుండా పారిపోయారు. ఇప్పుడు మేయర్ ఎన్నిక నుంచి పారిపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు.