న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్కు భారీగా బిల్లు ఎగ్గొట్టేశాడు. అబుదాబిలోని రాయల్ కుటుంబంతో లింక్ ఉందని చెప్పిన ఆ వ్యక్తి .. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్కు సుమారు 23 లక్షల బిల్లును కట్టకుండా అదృశ్యమయ్యాడు. ఈ కేసులో మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీన లీలా ప్యాలెస్ హోటల్లోని రూమ్ 427కు షరీఫ్ చెకిన్ అయ్యాడు. నాలుగు నెలల తర్వాత నవంబర్ 20వ తేదీన అతను హోటల్ నుంచి కనిపించకుండాపోయాడు. హోటల్ రూమ్లో ఉన్న అనేక సిల్వర్ ఐటమ్స్ను అతను దొంగలించినట్లు తెలుస్తోంది.
హోటల్లో చెకిన అయిన తర్వాత యూఏఈ రెసిడెంట్ అని ఆ వ్యక్తి సిబ్బందికి చెప్పాడు. అబుదాబి రాయల్ ఫ్యామిలీ షేక్ ఫలాహ్ బిన్ జయిద్ అల్ నహయన్ ఇంట్లో పనిచేస్తున్నట్లు అతను తెలిపాడు. యూఏఈ రెసిడెండ్ కార్డు, బిజినెస్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను అతను హోటల్లో చూపించాడు. తరుచూ హోటల్ సిబ్బందితో మాట్లాడుతూ వారిని దగ్గర చేసుకున్నాడు. అయితే అతను ఇచ్చిన డాక్యుమెంట్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
నాలుగు నెలలు హోటల్లో ఉన్న షరీఫ్కు 35 లక్షల బిల్లు అయ్యింది. అతను 11.5 లక్షల బిల్లు చెల్లించాడు. మిగితా అమౌంట్ చెల్లించకుండా అతను పారిపోయాడు. నవంబర్ 20వ తేదీన సిబ్బందికి 20 లక్షల చెల్లని చెక్కును ఇచ్చి వెళ్లిపోయాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.