న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తున్నది. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ-కృత్రిమ మేధ) చొచ్చుకొస్తున్నది. త్వరలో మన మనసును కూడా చదివేయబోతున్నది. నమ్మలేకపోతున్నారు కదూ. ఢిల్లీకి చెందిన అర్ణవ్ కపూర్ అనే విద్యార్థి కృత్రిమ మేధతో పనిచేసే ‘మైండ్ రీడింగ్’ హెడ్సెట్ను రూపొందించారు. దీని ద్వారా యూజర్లు నోరు తెరవకుండానే మెషీన్లు, ఏఐ అసిస్టెంట్లు, ఇతరులతో మాట్లాడొచ్చు. మనం మనసులో అనుకున్న మాటలను ఈ హెడ్సెట్ రీడ్ చేసి బయటకు చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే బయటకు మాట్లాడకుండానే, మీ మైండ్తో పిజ్జాను ఆర్డర్ చేయొచ్చు. ఈ హెడ్సెట్కు ‘ఆల్టర్ఈగో’ అని పేరు పెట్టారు.
ఢిల్లీలో పుట్టిన అర్ణవ్ కపూర్ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో పీహెడీ చేస్తున్నారు. 2018లోనే ఆయన ఈ మైండ్రీడింగ్ హెడ్సెట్ ప్రొటోటైప్ను రూపొందించాడు. మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి కోసం, ముఖ్యంగా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధులతో బాధపడుతున్నవారి కోసం అర్ణవ్ ఈ పరికరాన్ని తయారు చేశాడు. ప్రఖ్యాత మ్యాగజైన్ ‘టైమ్’ 2020లో విడుదల చేసిన టాప్-100 ఆవిష్కరణల్లో ఇది కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఆల్టర్ఈగో హెడ్సెట్ ధరించి అర్ణవ్ ఇచ్చిన తాజా ఇంటర్వూ వైరల్గా మారింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు అర్ణవ్ నోరు తెరవకుండానే సమాధానాలిచ్చాడు. ఆల్టర్ఈగో మాత్రమే కాకుండా అర్ణవ్ మరికొన్ని అద్భుత ఆవిష్కరణలు చేశాడు. అంధుల కోసం ద్రిష్టి అనే పరికరాన్ని రూపొందించాడు. 3డీ ప్రింటబుల్ డ్రోన్ను తయారుచేశాడు.