Delhi Liquor Case | హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశంలో రాజకీయ దుమారం రేపి.. ఏడేండ్లపాటు నడిచిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎలాంటి కుంభకోణం లేదంటూ 2017లో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, 2010లో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై ఆరోపణలు వచ్చింది మొదలు.. శూన్యంలో స్కామ్ను సృష్టించి బీజేపీ రాజకీయ లబ్ధిపొందింది.
2014లో కమలదళం అధికారంలోకి రావడానికి కూడా ఈ కేసు ఓ విధంగా సాయపడింది. చివరకు ఈ కేసులో ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017, డిసెంబర్ 21న సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అప్పటివరకూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు తర్వాత ఏమీ మాట్లాడలేదు.
ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసులోనూ బీజేపీ వైఖరి ఇలాగే ఉన్నదని, ఈ కేసు కూడా 2జీ కేసులాగే నీరుగారొచ్చని సోషల్మీడియాలో చర్చ మొదలైంది. కాగా, 2జీ కేసుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2018లో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను లోక్సభ ఎన్నికల సమయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించడం గమనార్హం.