న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు నాణ్యత కొద్దిగా మెరుగవడంతో బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాలపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం నుంచి ఎత్తివేసింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ ఢిల్లీలో కాలుష్య స్ధాయి పెరగడంతో బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాల రాకపోకలను నిషేధించింది.
కొద్ది రోజులుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) నిలకడగా ఉందని, ఈ బ్యాన్కు సంబంధించి ఎలాంటి తాజా ఉత్తర్వులు వెలువడకపోవడంతో సోమవారం ఉదయం నుంచి బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాలపై నిషేధాన్నిసడలిస్తున్నట్టు ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది.
ఢిల్లీలో కాలుష్య పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, వాయు నాణ్యత సూచీలో పెరుగుదల ఉంటే అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని పేర్కొంది. కాలుష్య తీవ్రతతో నియంత్రణలను కొనసాగించాలా లేదా అనే దానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉన్నతస్ధాయి సమావేశం జరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.