న్యూఢిల్లీ, మే 26: తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్లో గల ఓ ప్రైవేట్ పిల్లల దవాఖానలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు మరణించడం వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. స్థానికులు భవనం వెనకవైపు నుంచి లోపలికి వెళ్లి 12 మంది శిశువులను బయటకు తీసుకుని రాగలిగారు. అయితే అప్పటికే వారిలో ఏడుగురు చనిపోయారు. మిగిలిన శిశువులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మంటలు పక్కనున్న మరో రెండు భవనాలకు కూడా వ్యాపించాయి. రెండంతస్తుల దవాఖాన భవనంలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడం వల్ల మంటలు చెలరేగాయని డివిజినల్ అగ్నిమాపక అధికారి రాజేంద్ర తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిని క్షమించేది లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దవాఖాన ఉన్న భవనంలో అనుమతి లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను రీ ఫిల్లింగ్ చేస్తున్నారని స్థానికుడు ఒకరు తెలిపారు. ప్రమాదం జరిగిన దవాఖాన యజమాని నవీన్ కిచీని పోలీసులు అరెస్ట్ చేశారు. దవాఖానకు వైద్యశాఖ జారీ చేసిన లైసెన్స్ గడవు మార్చి 31నే ముగిసినట్టు విచారణలో తేలింది. ఈ వైద్యశాలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం కూడా లేనట్టు తెలిసింది.