న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. పీయూసీ ( Pollution under control ) సర్టిఫికెట్ ఉంటేనే వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపాలని నిర్ణయించింది. ఈ సర్టిఫికెట్ను తప్పనిసరిగా పెట్రోల్ బంకుల్లో చూపించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయనుంది. అయితే ఈ ప్రతిపాదనను అమలు చేసే కంటే ముందు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనుంది ఢిల్లీ ప్రభుత్వం.
ఈ సందర్భంగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలతో పాటు వాహనదారులు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనే ఉద్దేశంతోనే పీయూసీ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రజల ముందు ఉంచుతామన్నారు.
పర్యావరణ శాఖ సలహాదారు రీనా గుప్తా మాట్లాడుతూ.. ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తే వాయు కాలుష్యాన్ని చాలా తగ్గించొచ్చు అని అభిప్రాయపడ్డారు. ఒక వేళ పీయూసీ సర్టిఫికెట్ ఇన్వ్యాలిడ్ అయితే బంకుల్లోనే సర్టిఫికెట్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
శీతాకాలం సమయంలో నార్త్ ఇండియాతో పాటు ఢిల్లీలో అధికంగా వాయు కాలుష్యం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. పీయూసీ సర్టిఫికెట్ను తప్పనిసరి చేయడంతో.. వాహనాలు వెదజల్లుతున్న కాలుష్య స్థాయిలను తెలుసుకుని, కాలుష్యాన్ని అరికట్టేందుకు వీలుంటుంది.