Mobiles Ban | మొబైల్ ఫోన్లపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్తోపాటు పాఠశాలల పరిధిలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదని ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో 17 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ అరెస్టయిన నేపథ్యంలో స్కూల్ ఆవరణల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలివ్వాలని అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ, ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ విజ్ఞప్తులు చేశాయి. ఆ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ డైరెక్టరేట్ డైరెక్టర్ హిమాంశు గుప్తా తెలిపారు. స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినందుకు ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టరేట్కు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ అధ్యక్షుడు భరత్ అరోరా ధన్యవాదాలు తెలిపారు.
విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదు. ఒక వేళ విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చినా.. సురక్షితంగా నిల్వ చేసేందుకు లాకర్లను ఏర్పాటు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలిచ్చింది.