New Delhi : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని 2.3 లక్షల ఇండ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు అందించాలని నిర్ణయించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ సోలార్ ఎనర్జీ పాలసీకి రెండోసారి మార్పులు చేసింది. సోలార్ ప్యానెళ్ల ఇన్స్టలేషన్తోపాటు నిర్వహణ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరించనుంది.
ఈ నిర్ణయానికి రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపిందని సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రి అశిష్ సూద్ మీడియాకు తెలిపారు. పెరిగిపోతున్న విద్యుత్ భారం నుంచి ప్రజల్ని రక్షించేందుకు, సోలార్ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. 2.3 లక్షల ఇండ్లకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. వచ్చే ఏడాది మార్చి లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
LIVE: Press Conference on Delhi’s New Solar Policy https://t.co/loivBYby7O
— Rekha Gupta (@gupta_rekha) September 1, 2026
గృహాలకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘పీఎం సూర్య ఘర్ స్కీం’ అమలులో ఉంది. అయితే, దీనిపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది అంత లాభదాయకంగా లేకపోవడంతో ప్రజలు దీనికి ప్రాధాన్యమివ్వడం లేదు. అందుకే, ఇప్పుడు పూర్తి ఉచితంగా ఇంటింటికీ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఉన్న నిబంధన ప్రకారం.. వీటిని ఏర్పాటు చేసుకుంటే ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రోత్సాహకం అందించేది. ఇప్పుడు ఉచితంగా అందించడంతోపాటు, నిర్వహణ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరించనుంది.
ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న పథకం ప్రకారం.. ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.78,000 రాయితీ అందిస్తుంది. ఇప్పుడు మరో రూ.78,000ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అలాగే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కూడా కొనసాగుతుంది. కొత్త పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు.