న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే కరోనా వల్ల ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగి 5.33 శాతానికి చేరింది. ఈ నెల 10 నుంచి 15 వరకు గత ఐదు రోజుల్లో కరోనా కేసులతోపాటు పాజిటివిటీ రేటు మూడు రెట్ల మేర పెరిగాయి. ఈ నెల 10న 141 కేసులు నమోదు కాగా పాజిటివ్ శాతం 1.29గా ఉంది. శుక్రవారం నాటికి కొత్త కేసుల సంఖ్య 366కు, పాజిటివ్ రేటు 3.95కు పెరిగింది. గత 24 గంటల్లో 461 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో పాజిటివిటీ రేటు 5.33 శాతానికి పెరిగింది. అలాగే రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి.
కాగా, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరీక్షలను పెంచి వైరస్ సోకిన వారిని ముందస్తుగా గుర్తించి వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
మరోవైపు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఈ నెల 20న సమావేశం కానున్నది. కరోనా పరిస్థితిపై సమీక్షించి నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయనున్నది.