న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అన్ని విధాలుగా దూసుకుపోతున్నది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం రూపకల్పన, ప్రచారం, సీఎం అభ్యర్థుల ఖరారు లాంటి కార్యక్రమాల్లో ఆప్ ముందంజలో ఉన్నది. ఇతర పార్టీల కంటే ముందే ఆప్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అధికారంపై కన్నేసిన ఆప్.. ఆ రెండు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది.
గోవాలో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇప్పటికే సీఎం అభ్యర్థిని ప్రకటించింది. లోక్సభ సభ్యుడు భగవంత్ మాన్ పేరును పంజాబ్లో ఆప్ సీఎం క్యాండిడేట్గా ఖరారు చేసింది. మరోవైపు గోవాలో కూడా సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కసరత్తు పూర్తయినట్లు తెలుస్తున్నది. అందుకే రేపు (బుధవారం) గోవాలో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్నట్లు ఆప్ ప్రకటించింది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సీఎం క్యాండిడేట్ పేరు వెల్లడిస్తారని తెలిపింది.
ఈ మేరకు గోవా రాజధాని పనాజీలో రేపు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే అరవింద్ కేజ్రివాల్ గోవా సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడించనున్నారు.