న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: బీజేపీలో చేరితో నన్ను ఇబ్బంది పెట్టబోమని కమలం పార్టీ నాయకులు తనకు ఆహ్వానం పలికారని, కానీ తాను నిర్దంద్వంగా తిరస్కరించానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ‘వారు (బీజేపీ) ఏం చేయాలనుకుంటే చేసుకోనీ.. ఏమీ కాదు. నేను వారికి లొంగే ప్రశ్నే లేదు’ అని స్పష్టంచేశారు. ఢిల్లీలో రోహిణిలో ఆదివారం ఓ పాఠశాల భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు.
ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ఫిరాయింపులకు ప్రోత్సహించారంటూ చేసిన ఆరోపణలపై పోలీసులు కేజ్రీవాల్కు, మంత్రి ఆతిశీకి నోటీసులు ఇచ్చారు. వారు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను మూడు రోజుల్లోగా అందజేయాలని చెప్పారు. దీనిపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. తాము స్కూళ్లు, దవాఖానలు, క్లినిక్లు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని, ఇది తప్పా? అని ప్రశ్నించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామంటూ బీజేపీ నేతలు ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని కేజ్రీవాల్ గత నెల 27న ఆరోపించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడం శిక్షించదగిన నేరం కాబట్టి, మీ దగ్గరున్న సమాచారాన్ని ఈ నెల 5లోగా అందజేయండి అని కోరుతూ ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్కు నోటీసులిచ్చారు.
నేను జైలుకు పోయినా అభివృద్ధి ఆగదు
తనను జైలుకు పంపినా ప్రజల కోసం తాము చేపట్టిన అభివృద్ధి పనులు ఆగబోవని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. స్కూళ్లు కట్టినందుకే సిసోడియాను జైలులో పెట్టారని చెప్పారు. మొహల్లా దవాఖానలు కట్టినందుకే సత్యేందర్ జైన్ను జైలులో పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్ను కూడా జైలులో పెట్టినా అభివృద్ధి పనులు ఆగబోవని స్పష్టం చేశారు.