న్యూఢిల్లీ: బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి అత్యవసర వైద్యం కోసం ఆ విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. విస్తారా ఫ్లైట్ యూకే-818, గురువారం రాత్రి బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న ఢిల్లీకి చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్ శ్వాస తీసుకోకపోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పి మూర్ఛపోయాడు.
దీంతో ఆ విమానాన్ని దారి మళ్ళించి రాత్రి 9.30 గంటల సమయంలో ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఆ ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రమోద్ కుమార్ శర్మ శుక్రవారం తెలిపారు. అగర్వాల్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారనన్నారు. ఆయన మృతదేహానికి పోస్ట్మార్టం అనంతరం ఢిల్లీలోని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారి వివరించారు.