హనుమాన్ చాలీసా పఠనం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, నవ నిర్మాణ్ సేన డుమ్మా కొట్టాయి. ఇంతటి కీలక సమావేశానికి సీఎం ఉద్ధవ్ హాజరు కాలేదని, తామెందుకు వెళ్తామని మాజీ సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఇక… అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చర్చను ప్రారంభించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత హోంమంత్రి దిలీప్ పాటిల్, మంత్రి ఆదిత్య థాకరే మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదిత్య థాకరే మాట్లాడుతూ… లౌడ్ స్పీకర్ల విషయంలో కేంద్రాన్ని కలుస్తామని, ఓ బృందంగా వెళ్లి, కేంద్రంతో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. అసలు దేశ వ్యాప్తంగా కేంద్రం లౌడ్ స్పీకర్ల విషయంలో ఓ నిర్ణయాన్ని తీసుకుంటే, రాష్ట్రాలకు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదన్నారు.
ఇక మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వాటికి భంగం వాటిల్లితే పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్ల విషయంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటే… తమకు ఈ తలనొప్పులు ఉండేవే కావన్నారు. అతి త్వరలోనే తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై కలుస్తామని దిలీప్ వాల్సే ప్రకటించారు.