న్యూఢిల్లీ, మే 17: ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై అధికారుల ధిక్కరణ కొనసాగుతున్నది. పాలనా వ్యవహారాలు, బదిలీలు, నియామకాల అధికారం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుంది తప్ప లెఫ్ట్నెంట్ గవర్నర్కు కాదని సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఢిల్లీ అధికార యంత్రాంగం వంటపట్టించుకున్నట్టు కన్పించడం లేదు. దానికి ఉదాహరణే ఈ తాజా ఘటన. ఐఏఎస్ల బదిలీలపై నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ బోర్డు సమావేశం చీఫ్ సెక్రటరీ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయింది. నిర్దేశించిన సమావేశానికి హాజరు కాకపోవడమే కాకుండా ‘బిజీ షెడ్యూల్’ కారణంగా రావట్లేదని చెప్పడం నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ఠగా భావిస్తున్నారు. ఢిల్లీ సర్వీసెస్ మంత్రి సౌరభ్ భరద్వాజ మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు సీఎస్ నరేష్ కుమార్ కోసం రోజంతా వేచి చూసినా తాను బిజీగా ఉన్నానంటూ సీఎస్ సమావేశానికి డుమ్మా కొట్టారు.