న్యూఢిల్లీ: అత్యాధునిక సబ్మెరైన్లను నిర్మించేందుకు భారత్ సన్నద్దమైంది. భారతీయ నేవీ కోసం ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు రక్షణశాఖ సుమారు రూ.43000 కోట్లు కేటాయించింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో సబ్మెరైన్ల ప్రాజెక్టుకు ఆమోదం దక్కింది. స్వదేశీయంగా సబ్మెరైన్లను నిర్మించేందుకు త్వరలోనే ప్రతిపాదలనలను జారీ చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది.
మజగాన్ డాక్స్(ఎండీఎల్), లార్సెన్ అండ్ టర్బో(ఎల్అండ్టీ) సంస్థలకు రక్షణశాఖ ప్రతిపాదనల రిక్వెస్ట్ పంపింది. ప్రాజెక్ట్-75 ఇండియా కింద ఆరు డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్ల కన్నా పెద్ద సైజులో ఉండనున్నాయి. జలాంతర్గాముల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధాలను అమర్చనున్నారు. 12 ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్స్ ఉండనున్నాయి. యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైళ్లను కూడా వాడనున్నారు. సుమారు 18 హెవీవెయిట్ టార్పిడోలను మోసుకువెళ్లే విధంగా సబ్మెరైన్లు ఉండాలని ఇప్పటికే నేవీకి సూచనలు చేశారు. ప్రస్తుతం భారతీయ నేవీ వద్ద 12 సబ్మెరైన్లు ఉన్నాయి. దీంతో పాటు ఐఎన్ఎస్ హరిహంత్, ఐఎన్ఎస్ చక్ర లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్లు కూడా ఉన్నాయి.