సైద్పూర్(యూపీ) జూలై 2: అది ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా సైద్పూర్ గ్రామం. అక్కడ 2 వేల ఇండ్ల దాకా ఉంటాయి. వీటిలో దాదాపు సగం కుటుంబాల్లో కొన్ని తరాలుగా సైన్యంలో పనిచేసిన లేదా పనిచేస్తున్న వారు ఉన్నారంటే దేశసేవకు ఆ గ్రామస్తులు ఎంతగా ముందుకు వస్తున్నారో అర్థమవుతున్నది. సాయుధ దళా ల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్పై పథకంపై అక్కడి యువత, రిటైర్డ్ జవాన్లు మండిపడుతున్నారు. ఈ స్కీమ్ వల్ల సైన్యంలో చేరాలనుకుంటున్న ఆశలు అడియాశలు అయ్యాయని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రోజువారీగా కూలీలు, భూమి లేని రైతుల కుటుంబాలు, వారి బిడ్డల్లో కొత్త స్కీమ్పై అభద్రతా భావం నెలకొన్నది.
ఇంత కష్టం నాలుగేండ్ల కోసమా?
శివ శిరోహి అనే యువకుడి తండ్రి, తాత ఆర్మీలో పనిచేశారు. ఇప్పుడు వారి బాటలో దేశ సేవ చేయాలనుకుంటున్న అతనికి కొత్త పథకం అనిశ్చిత పరిస్థితులు తెచ్చిపెట్టింది. ‘జవాన్ అవ్వాలని తప్ప మరొకటి అనుకోలేదు. రోజూ ఉదయాన్నే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేస్తున్నా. అయితే అగ్నిపథ్ మా గ్రామంలోని అందరి ఆశలు అడియాశలు చేసింది. ఇంతగా కష్టపడుతున్నది కేవలం నాలుగేండ్ల కోసమా?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆశిష్ అనే మరో 17 ఏండ్ల యువకుడు మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఉన్న సైనిక వాతావరణం వల్ల ఇక్కడి ప్రతీ బాలుడిలో సైనికుడిగా దేశానికి సేవ చేయాలనే కల ఉంటుందని, అగ్నిపథ్ వల్ల ఇప్పుడు రెండో ఆలోచన చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సైన్యమే నా చివరి గమ్యస్థానం అనుకున్నాను. నాలుగేండ్ల తర్వాత మరో ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఒకవేళ నాలుగేండ్ల తర్వాత పోలీసో లేక గార్డో అయ్యేపనైతే.. ఇప్పుడే ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయకూడదు!’ అని ఆ రోజువారీ కూలీ కుమారుడు కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
బెదిరింపులతో ఆందోళనల అణిచివేత
అగ్నిపథ్పై యువకుల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నా.. కేసులు, యూపీ ప్రభుత్వ ‘బుల్డోజర్లు’, సాయుధ బలగాల్లో ప్రవేశాలకు అనర్హత వంటి వాటి వల్ల.. తమ కలలు కల్లలవుతున్నా ఆందోళనలు చేయలేకపోతున్నారని ఆర్మీ జవాన్గా రిటైర్డ్ అయిన 45 ఏండ్ల వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. నాలుగేండ్లు జవానుగా పనిచేసిన వ్యక్తి.. ఆ తర్వాత గార్డుగా సంతోషంగా పని చేయగలడా? అని ప్రశ్నించారు. సైన్యంలో విధి నిర్వహణలో మరణించిన వారికి గుర్తుగా గ్రామం మధ్యలో ఒక స్మారక చిహ్నం నిర్మించారు. దానిపై ‘1914-19 మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ గ్రామం నుంచి 155 మంది వెళ్లగా, అందులో 29 మంది వీర మరణం పొందారు’ అని రాసి ఉన్నది.