తిరువనంతపురం : అదృష్టం తలుపుతడితే ఎంతటి విపత్కర పరిస్ధితినైనా అధిగమించవచ్చని వెల్లడైంది. అప్పులు తీర్చేందుకు కేరళలోని కొజికోడ్లో ఓ వ్యక్తి (50) తన ఇంటిని అమ్మకానికి పెట్టిన కొద్ది గంటల్లోనే రూ కోటి లాటరీ తగలడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పెయింటర్ మహ్మద్ బవా ఏమీ పాలుపోని స్ధితిలో తన 2000 చదరపు అడుగుల ఇంటిని అమ్మకానికి పెట్టి సోమవారం టోకెన్ అడ్వాన్స్ తీసుకున్న కొన్ని గంటల్లోనే జాక్పాట్ వరించింది. ఎనిమిది నెలల కిందట నిర్మించిన ఇంటిని అమ్మక తప్పని పరిస్ధితి నెలకొనడంతో అద్దె ఇంటికి మారాలని బవా కుటుంబం భావించింది.
బవాకు భార్య, నలుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరు పెద్ద కూతుళ్లకు వివాహం జరిపించగా మరో ఇద్దరు కూతుళ్లు స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు జరిపించి ఇంటి నిర్మాణం చేపట్టడంతో బవా అప్పుల పాలయ్యాడు. బ్యాంకులు, బంధువుల వద్ద రూ 50 లక్షలు బాకీ పడ్డాడు. తన కుమారుడు నిజాముద్దీన్ను ఖతార్కు పంపించేందుకు కూడా బవా అప్పు చేశాడు. స్నేహితులు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో హోసన్గడిలోని ఓ ఏజెన్సీ నుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు.
ఏదో ఒక రోజు జాక్పాట్ కొడతాననే ఆశతో లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఇక లాభం లేదనుకుని అప్పులు తీర్చేందుకు తన ఇంటిని రూ 40 లక్షలకు విక్రయించేందుకు సిద్ధపడగా జాక్పాట్ తగిలిందనే సమాచారంతో బవా ఉద్వేగానికి లోనయ్యాడు. ట్యాక్స్లు మినహాయిస్తే బవాకు రూ 63 లక్షల వరకూ లభించనున్నాయి. ఇంటి అమ్మకం ఆలోచన విరమించుకున్న బవా జాక్పాట్ మొత్తంతో అప్పులు తీర్చాలని భావిస్తున్నాడు.