కొట్టాయం: కేరళ రాష్ట్రాన్ని ఎడతెగని వర్షాలు ( Kerala rains ) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా కేరళ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని కూట్టికల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వర్షాలు, కొండ చరియలవల్ల ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొట్టాయం జిల్లాకు చెందిన వారు 13 మంది, ఇడుక్కి జిల్లాకు చెందినవారు 8 మంది ఉన్నారు. ఈ విషయాన్ని కేరళకు చెందిన సమాచార, ప్రజాసంబంధాల విభాగం వెల్లడించింది.