న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా 156 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. జూలై నాటికి 21 కోట్ల వ్యాక్సిన్లు, ఆగస్టు-డిసెంబర్ మధ్య 135 కోట్ల వ్యాక్సిన్లు లభిస్తాయని సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
వ్యాక్సిన్ల సేకరణకు కుదిరిన ఒప్పందాల ఆధారంగానే సుప్రీంకోర్టులో ఈ అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది. కొన్ని సంస్థలతో వ్యాక్సిన్ల ఒప్పందాలు ఖరారు ప్రక్రియలోనే ఉన్నాయి.
వచ్చేనెలాఖరు నాటికి 51.6 కోట్ల డోస్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేంద్రం పేర్కొంది. దేశ ప్రజలకు మూడు సంస్థల వ్యాక్సిన్లు వేస్తున్నారు. అవన్నీ రెండు డోస్లు వేయాల్సిందే.
సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ప్రకారం 51.6 కోట్ల డోస్లు అంటే 25.8 కోట్ల మందికి రెండు డోస్లు వేయవచ్చు. 51.6 కోట్లలో 35.6 కోట్ల డోస్లు ఇప్పటికే పంపిణీ చేసింది కేంద్రం. 26,53,84,559 మంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. 5,63,75,518 కోట్ల మందికి రెండు డోస్లు వేశారు.
కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ప్రకారం డిసెంబర్ నాటికి 135 కోట్ల టీకాలు సేకరించనున్నది. 2011 జనాభా ప్రకారం 94.02 కోట్ల మంది యువజనులు ఉంటారని, కేంద్రం అంచనా వేస్తున్నది.
డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్లు లభిస్తాయని గత నెలలో కేంద్రం పేర్కొంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా 257 కోట్ల వ్యాక్సిన్లు వస్తాయని చెప్పుకొచ్చారు.