Nirmala SitaRaman | యాంత్రిక్స్-దేవాస్ మధ్య కుదిరిన ఒప్పందం పూర్తిగా అవినీతి మయం అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇది యావత్ జాతికి జరిగిన మోసం అని అభిప్రాయ పడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వేవ్లెంగ్త్, శాటిలైట్లు, స్పెక్ట్రం తదితరాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడంతో గత యూపీఏ ప్రభుత్వానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ అవినీతి బయట పడిందన్నారు. యాంత్రిక్స్తో ఒప్పందాన్ని యూపీఏ సర్కార్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో దేవాస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు ఆర్బిట్రేటర్ను నియమించాలన్నా కేంద్రం స్పందించలేదని నిర్మలా సీతారామన్ మండి పడ్డారు.
ఇస్రో అనుబంధ సంస్థ యాంత్రిక్స్. 2005లో యాంత్రిక్స్తో కుదిరిన ఒప్పందం ప్రకారం దేవాస్కు రెండు ఉపగ్రహాలు తయారు చేసి ఇవ్వాలి. ఈ ఉప గ్రహాల ద్వారా 70 మెగా హెర్ట్జ్ ఎస్-బ్యాండ్ స్పెక్ట్రం దేవాస్కు అందుబాటులోకి తేవాలి. ఈ స్పెక్ట్రంను ఉపగ్రహ, భౌగోళిక కమ్యూనికేషన్లతో కూడిన మిశ్రమ వ్యవస్థకు ఉపయోగించుకోవాలని దేవాస్ ప్లాన్. అయితే, ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలోనే 2011 ఫిబ్రవరిలో నాటి మన్మోహన్ సింగ్ సర్కార్.. యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలొచ్చాయి.
మన్మోహన్ సింగ్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేవాస్ దాఖలు చేసిన పిటిషన్పై అమెరికా న్యాయస్థానం తీర్పు చెప్పింది. దేవాస్కు రూ.8.09 కోట్ల పరిహారం చెల్లించాలని యాంత్రిక్స్ను ఆదేశించింది. తొలుత దేశంలోని పలు న్యాయస్థానాలతోపాటు సుప్రీంకోర్టులో దేవాస్ పిటిషన్లు వేసింది. ట్రిబ్యునల్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలని దేవాస్కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 2018 సెప్టెంబర్లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ కోర్టును దేవాస్ ఆశ్రయించింది. అదే ఏడాది నవంబర్లో యాంత్రిక్స్ పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది.