న్యూఢిల్లీ, మార్చి 12: ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత అప్డేట్ ప్రస్తుత గడువు మార్చి 14తో ముగుస్తుండగా, దీనిని జూన్ 14 వరకు పెంచింది. ఈ మేరకు ‘ఉడాయ్’ మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
దీని ప్రకారం జూన్ 14 వరకు ఆధార్లో మార్పులు ఉచితంగా చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉడాయ్ పేర్కొన్నది. ఆధార్ తీసుకొని 10 ఏండ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం లేటెస్ట్ గుర్తింపు కార్డు, చిరునామా వివరాలు అందజేయాలి.
ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని ‘ఉడాయ్’ మరోమారు స్పష్టం చేసింది. అలాగే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాల్ని సందర్శించి ఆఫ్లైన్లోనూ ఆధార్ వివరాలు అప్డేట్ చేయవచ్చునని తెలిపింది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా.. రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వాడొచ్చు. టీసీ, మార్క్షీట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్.. వంటివి గుర్తింపు పత్రాలుగా ఉపయోగపడతాయని ఉడాయ్ పేర్కొన్నది.