న్యూఢిల్లీ, ఆగస్టు 24:గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇక ‘ఆధార్’ ఆధారంగానే చెల్లింపులు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద పనిచేసే వారి తప్పనిసరి ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం గడువును ఆక పొడిగించబోమని కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద పనిచేసే కూలీలు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం (ఏబీపీఎస్) కింద నమోదు కావాలంటూ ఈ నెల 31 గడువుగా విధించిన సంగతి తెలిసిందే.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద నమోదై పనిచేస్తున్న కూలీలకు చెల్లించే కూలి మొత్తాన్ని ఇవ్వడానికి కేంద్రం ఈ విధానాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పనిచేసే వారి చేతికి డబ్బు ఇవ్వకుండా ఈ విధానంలోనే చెల్లింపులు చేస్తామని ప్రకటిస్తూ తొలుత దీనికి ఫిబ్రవరి 1 గడువుగా నిర్ణయించినప్పటికీ దానిని పలుసార్లు పొడిగిస్తూ ఆగస్టు 31గా నిర్ణయించింది. అయితే ఇక దానిని పొడిగించే ప్రసక్తి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇప్పటికీ 1.13 కోట్ల మంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లబ్ధిదారులు తమ బ్యాంక్ అకౌంట్లను ఆధార్తో అనుసంధానం చేయలేదంటూ ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు.