న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు ఢిల్లీ మహిళా కమిషన్ గత ఎనిమిదేండ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డులను ప్రదానం చేస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి శనివారం రాత్రి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వాళ్లలో కేరళకు చెందిన 106 ఏళ్ల బామ్మ కుట్టియమ్మ కొంతి కూడా ఉన్నారు.
కుట్టియమ్మ ఈ అవార్డుకు ఎంపిక కావడానికి కారణం 104 ఏళ్ల వయసులో (2021లో) కేరళ డిస్ట్రిక్ట్ లిటరసీ పరీక్షల్లో పాస్ కావడం. ఆ పరీక్షల్లో ఆమె 89 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలు అయ్యారు. దాంతో కేరళ డిస్ట్రిక్ట్ లిటరసీ పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అయిన అత్యంత వృద్ధురాలిగా కుట్టియమ్మ గుర్తింపు పొందారు. దాంతో ఢిల్లీ మహిళా కమిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.
శనివారం రాత్రి జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేజ్రివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కుట్టియమ్మతోపాటు 105 ఏళ్ల రాంబాయి, 95 ఏళ్ల భగవానీ దేవి దాగర్ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు.