న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని దరియాగంజ్లో ఉన్న ఓ పబ్లిక్ టాయిలెట్లో సుమారు 50 లీటర్ల యాసిడ్(Acid)ను గుర్తించారు. ఢిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మాలివాల్(DCW Chief Swati Maliwal) నిర్వహించిన ఆకస్మిక తనిఖీ సమయంలో యాసిడ్ విషయం బయటపడింది. గురువారం రాత్రి నిర్వహించిన ఆ తనిఖీకి చెందిన వీడియోను స్వాతి తన ట్విట్టర్లో సేర్ చేశారు. పబ్లిక్ టాయిలెట్(public toilet)లో ఇంత మొత్తంలో యాసిడ్ ఉండడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ యాసిడ్తో ఎంత మంది జీవితాలు నాశనం అయ్యేవాని ఆమె ప్రశ్నించారు. పోలీసుల్ని పిలిపించి ఆ యాసిడ్ను సీజ్ చేశారు. ఎంసీడీ నుంచి వివరణ కోరుతున్నట్లు ఆమె చెప్పారు.
గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడి ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బైక్పై వచ్చిన వ్యక్తులు ఓ టీనేజ్ అమ్మాయిపై యాసిడ్ పోశారు. ఆ ఘటన తర్వాత యాసిడ్ అమ్మకాలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యాసిడ్ కొనేవారిపై నిఘా పెట్టాలన్న డిమాండ్ పెరిగింది. రిటేల్ దుకాణాల్లో యాసిడ్ అమ్మకాల అంశంపై 2013లోనే సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. యాసిడ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు 3 లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది.
2018, 2019లో ఢిల్లీలో 11 యాసిడ్ అటాక్ కేసులు నమోదు అయ్యాయి. 2020లో కేవలం రెండు కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 2018లో దేశవ్యాప్తంగా 228 యాసిడ్ అటాక్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. 2019లో 249, 2020లో 182 కేసులు నమోదు అయ్యాయి.