Womens Empowerment | మహిళా సాధికారత.. ఇప్పుడు ఇది ప్రతిచోటా చర్చనీయాంశం. ఉత్తరప్రదేశ్లోని ఆ గ్రామం మహిళా సాధికారతకు పెట్టింది పేరు. కౌశాంబి జిల్లా కరారీనగర్లోని పూర్వ అనే పల్లెటూరులో పలు రకాల సామాజిక సరిహద్దులనండి.. ఆంక్షలనండి.. అవన్నీ చెరిగిపోయాయి.. ఇది అల్లుళ్ల ఊరు.. అలాగంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది అక్షరాల నిజం.. సంప్రదాయం అన్నా.. ఇది మహిళా సాధికారతకు పెట్టింది పేరు. ఈ ఊరి యువతులను పెండ్లి చేసుకున్న భర్తలు.. ఇక్కడికే వచ్చి సెటిల్ కావడం పూర్వ పల్లెటూరు సంప్రదాయంగా మారింది. ఇక్కడ 400 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామ ఆడబడుచులు తాము పెండ్లాడిన భర్తలతో కలిసి మొత్తం కుటుంబాన్నే నడుపుతున్నారు.. ఈ కథేంటో చూద్దామా..!
పూర్వ పల్లెలో నివసిస్తున్న వారిలో అత్యధికులు బయటివారే. పెండ్లయిన తర్వాత ఇదే గ్రామంలో మకాం పెడుతున్నారు. అత్తమామల నుంచి వారికి స్వేచ్ఛ ఉంటుంది. తనతో కలిసి జీవించడానికి వచ్చిన భర్తతో సమానంగా కుటుంబ జీవనంలో ఈ ఊరి అమ్మాయిలు చేదోడుగా నిలుస్తారు.
మహిళలు ఇండ్ల వద్దే బీడీలు తయారుచేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నడుపుతుంటారు. ఈ ట్రెండ్ ఇక్కడి వారికి కొత్త కాదు.. కొన్ని దశాబ్దాలుగా అల్లుళ్లు వచ్చి ఈ గ్రామంలో సెటిలవుతుంటారు. 70-25 ఏండ్ల మధ్య వయస్సు గల అల్లుళ్లు తమ కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. ఈ గ్రామ మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి. కొడుకులతోపాటు సమానంగా కూతుళ్లకు విద్యావకాశాలు కల్పించడం పూర్వ ప్రత్యేకత. కొడుకులతో సమానంగా కూతుళ్లు పని చేస్తుంటారు.
తన భర్త 20 ఏండ్ల క్రితం పెండ్లయ్యాక తమ ఊళ్లోకే వచ్చి జీవిస్తున్నారని యాస్మిన్ బేగం అనే మహిళ చెప్పారు. అత్తింట్లో స్వేచ్ఛ ఎలా ఉంటుందనే అంశమే తలెత్తదు. తమ అత్తింటి వారితోనూ అనుబంధం ఉందంటున్నారు యాస్మిన్ బేగం. తన భర్తతో కలిసి జీవిస్తూనే.. తనకు నచ్చిన పని చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారావిడ.
అల్లుళ్లకు నిలయమైన ఈ పల్లెటూరిలో స్కూళ్లు, మార్కెట్లు ఇతర వసతులన్నీ ఉన్నాయి. తమ భార్య ఇండ్లనే తమ సొంతిండ్లుగా భావిస్తూ నివసిస్తున్నారు. తమ ఊళ్లలో వసతుల లేమి కూడా పూర్వ పల్లెటూరుకు రావడానికి మరో కారణం అంటున్నారు. పిల్లలకు విద్యా ఉద్యోగావకాశాలు ఉండటంతో అత్తింటికి వచ్చి సెటిలవుతున్నామని చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో పలు తరాల అల్లుళ్లు కలిసి ఉంటున్నారు.
ఇల్లరికం అల్లుడంటే చిన్న చూపు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు.. అత్తింటితోపాటు ఊళ్లోనూ అల్లుళ్లకు గౌరవ లభిస్తుంది. కుటుంబాల్లో వివాదాలు చాలా తక్కువ అంటున్నారు గ్రామ కౌన్సిలర్ యశ్వంత్ యాదవ్. ప్రతి ఒక్కరికి అవసరమైన వసతులు ఉండటం వల్లే అల్లుళ్లు ఇక్కడికి వస్తున్నారు.