అలహాబాద్: నైతిక బాధ్యతను చట్టపరమైన విధిగా గుర్తించలేమని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు తమ కోడలి నుంచి భరణం ఇప్పించాలన్న వృద్ధ జంట పిటిషన్ను ఇటీవల కొట్టివేసింది. పిటిషనర్ల వాదన ప్రకారం.. వారి కొడుకు యూపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ 2021లో మరణించారు. వారి కోడలు కూడా కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. తామిద్దరం వృద్ధులమని, నిరక్షరాస్యులమని, కొడుకు మీదే ఆర్థికంగా ఆధారపడ్డామని.. కాబట్టి తమ కోడలికి తమకు భరణం ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఉందని.. కాబట్టి ఆమె నుంచి తమకు భరణం ఇప్పించాలని స్థానిక కుటుంబ న్యాయస్థానంలో కేసు వేశారు. కోర్టు కోడలికి అనుకూలంగా తీర్పివ్వడంతో వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరు పార్టీల వాదనలు విన్న తరవాత కోర్టు స్పందిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 144 ప్రకారం భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మాత్రమే ఓ వ్యక్తిపై ఆధారపడిన వారి నిర్వచనం పరిధిలోకి వస్తారని.. అత్త మామలు ఆ నిర్వచనంలో లేరు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపారు. ‘నైతిక బాధ్యత ఎంత బలమైన భావన అయినా అది చట్టపరమైన నిబంధనగా లేనప్పుడు దాన్ని చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.