బెంగళూరు, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ఓటర్ల ప్రైవేటు డాటా సేకరణ అంశం రాజకీయ దుమారం రేపుతున్నది. రాజధాని బెంగళూరులో చిలుమె ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ప్రైవేటు సంస్థ గత ఆగస్టు నుంచి ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల ఆధార్ నంబర్, ఓటర్ ఐడీ నంబర్తోపాటు లింగం, కులం, మాతృభాష తదితర వ్యక్తిగత వివరాలు సేకరించి తన వెబ్సైట్లో ఉంచింది.
నిజానికి ఈ సంస్థ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నుంచి అనుమతి తీసుకొన్నది. వచ్చే ఏడాది మధ్యలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్ల డాటాను తస్కరించేందుకు స్వయంగా సీఎం బొమ్మై ఈ కుంభకోణానికి తెరలేపారని కాంగ్రెస్ ఆరోపించింది. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను సీఎం ఖండించారు. ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. వివాదం నేపథ్యంలో ఓటర్ల వివరాల సేకరణ అనుమతులను బీబీఎంపీ బుధవారం రద్దుచేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లను మొదట్లోనే గల్లంతు చేసే కుట్రలో భాగంగానే ఈ సర్వే చేపట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ తరఫున సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) బాధ్యతను చిలుమెకు బీబీఎంపీ అప్పగించింది. ఈ సంస్థ రాష్ట్ర మంత్రిది అని సమాచారం. ఈ సంస్థ తమ సిబ్బందిని నకిలీ గుర్తింపు కార్డులతో రంగంలోకి దించి వివరాలు సేకరించింది. శాసనసభ్యుల పనితీరు గురించి అడిగి తెలుసుకొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకొనేందుకు ఇది సూచిక. ఎన్నికల సంఘం సిబ్బంది ఎవరూ శాసనసభ్యుల పనితీరు గురించి ప్రశ్నించరు. ఈ వివరాలను ఎన్నికల సంఘం యాప్ గరుడలో కాకుండా చిలుమె సంస్థ- డిజిటల్ రివ్యూ యాప్లోకి ఎకించారు. ఆగస్టు 19న చిలుమెకు బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ సర్వేకు అనుమతి ఇచ్చారు. సర్వే వివరాలను రాజకీయ పక్షాలు, నేతలకు అమ్మి కోట్లు సొమ్ము చేసుకోవటమే ఆ సంస్థ లక్ష్యమని ఆరోపణలు వచ్చాయి.