న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తున్న నేపథ్యంలో.. కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుల గురించి చర్చ మొదలైంది. అయితే మేటి వ్యాక్సిన్ నిపుణురాలు డాక్టర్ గగన్దీప్ కంగ్ దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్లోకి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కార్ ప్రయత్నించాలని ఆమె అభిప్రాయపడ్డారు. కోవిడ్19కు mRNA వ్యాక్సిన్లను బూస్టర్ డోసు రూపంలో ఇస్తే ఉత్తమంగా పనిచేస్తాయని డాక్టర్ గగన్దీప్ తెలిపారు.
మెసెంజర్ ఆర్ఎన్ఏ లేదా mRNA టెక్నాలజీతో .. వైరస్కు చెందిన జన్యు కోవిడ్ను స్వల్ప స్థాయిలో ఇంజెక్ట్ చేస్తారు. దీని ద్వారా రోగనిరోధక శక్తిలో మార్పును తీసుకువస్తారు. కరోనా వైరస్లో ఉన్న ప్రోటీన్ల తరహాలో మానవ కణాలను అది తయారు చేస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి ఉత్తేజం అవుతుంది. ఈ వ్యాక్సిన్లో ఎటువంటి వైరస్ ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఫైజర్, మోడెర్నా mRNA వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
వెల్లోర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మైక్రోబయోలజీ ప్రొఫెసర్గా డాక్టర్ కంగ్ చేస్తున్నారు. అయితే స్వదేశీ mRNA వ్యాక్సిన్ కోసం ఇండియా ఇంకా కొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. పూణెకు చెందిన జెన్నోవా బయోఫార్మసీ కంపెనీ mRNA వ్యాక్సిన్ ఫ్లాట్ఫామ్ను డెవలప్ చేసినట్లు ఆమె తెలిపారు. అయితే బూస్టర్ డోసులు ప్రతి ఒక్కరికీ అవసరం లేదని, కేవలం దుర్బర పరిస్థితుల్లో ఉన్నవారికే అవి అవసరమన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం ఉత్తమమన్నారు. కానీ ఏ కంపెనీ వ్యాక్సిన్ను బూస్టర్గా ఇవ్వాలన్న దానిపై క్లారిటీ లేదన్నారు. కోవీషీల్డ్ టీకా తీసుకున్నవారిలో కోవీషీల్డ్ బూస్టర్ ఉత్తమంగా ఉన్నట్లు తేలిందన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా mRNA వ్యాక్సిన్లు కూడా బెస్ట్ బూస్టర్లు అని తేలినట్లు చెప్పారు. అయితే యాంటీబాడీలు టెస్ట్ చేయించుకున్న తర్వాతే.. ఆ లెవల్స్ తక్కువగా ఉన్నవాళ్లు బూస్టర్లు వేసుకుంటే మేలు అని ఆమె తెలిపారు.