లక్నో: లైంగిక వేధింపులను ప్రతిఘటించడంతో దళిత యువతిని వేడి నూనెలోకి తోసివేశారు.( Dalit Teen Pushed Into Hot Oil ) దీంతో ఆమె శరీరంలో సగానికిపైగా కాలిన గాయాలయ్యాయి. బాధిత యువతి సోదరుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూనె మిల్లు యజమానితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధనౌరా సిల్వర్నగర్ గ్రామంలోని ఆయిల్ మిల్లులో 18 ఏళ్ల యువతి, ఆమె కుటుంబ సభ్యులు పని చేస్తున్నారు. శనివారం మిల్లు యజమాని ప్రమోద్, అతడి అనుచరులు రాజు, సందీప్ ఆ యువతిని లైంగికంగా వేధించారు. ఆమె అభ్యంతరం చెప్పడంతో కులం పేరుతో దూషించారు. అనంతరం అక్కడ కళాయిలో కాగుతున్న వేడి నూనెలోకి ఆ యువతిని తోసేశారు.
కాగా, దళిత యువతి శరీరంలో సగానికిపైగా కాలిన గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి సోదరుడి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులైన నూనె మిల్లు యజమాని ప్రమోద్, అతడి అనుచరులు రాజు, సందీప్ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.