ఉజ్జయిని : కఠిన చట్టాలు, సామాజిక సంస్కరణలు అమలవుతున్నా కుల వివక్ష మాత్రం సమసిపోలేదు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో దళిత వర్గానికి చెందిన పెండ్లికొడుకు, పోలీస్ కానిస్టేబుల్ను ఆలయంలోకి రాకుండా అగ్ర వర్ణాలకు చెందిన కొందరు అడ్డగించారు.
ఆదివారం రాత్రి బర్దియా గ్రామంలో తన పెండ్లి ఊరేగింపు కొనసాగుతున్న క్రమంలో ఆలయంలో రాముడి ఆశీస్సులు తీసుకునేందుకు పెండ్లికొడుకు మహర్బన్ పర్మార్ వెళ్లగా అతడిని అడ్డుకునే ఉద్దేశంతో ఆలయ గేట్లకు తాళం వేశారు. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేసే కైలాష్ పర్మార్ అనే వ్యక్తికి కూడా సోమవారం ఇలాంటి అనుభవమే ఎదురైంది.
తమను ఆలయంలోకి రాకుండా అడ్డగించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులతో కలిసి అఖిల భారత బలై ఫెడరేషన్ జిల్లా ఎస్పీ సత్యేంద్ర శుక్లా, జిల్లా మేజిస్ట్రేట్ సతోష్ ఠాగూర్లకు వినతి పత్రం సమర్పించింది. కాగా పూజారి కుటుంబ సభ్యులు ఒకరు మరణించడంతోనే ఆలయానికి తాళాలు వేశామని, ఆలయాన్ని నిర్వహించే రాజ్పుట్ వర్గీయులు పేర్కొన్నారు.