Diabetes | బెంగళూరు: డయాబెటిస్ ఉన్నదంటూ బీమా క్లెయిమ్ను బీమా కంపెనీ తిరస్కరించరాదని దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది. క్లెయిముదారు కేఎస్ రాజీవ (70)కి రూ.48,872లను, దీనిపై సంవత్సరానికి 8 శాతం వడ్డీతో సహా చెల్లించాలని బజాజ్ అలయెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ను ఆదేశించింది. నష్టపరిహారం కింద రూ.10,000; ప్రొసీడింగ్స్ ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని స్పష్టంచేసింది.
బజాజ్ అలయెన్స్ నుంచి రాజీవ తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ 2022 నవంబరు 9 నుంచి 2023 నవంబరు 18 వరకు చెల్లుబాటవుతుంది. శ్వాస సమస్యలతో ఆయన 2022 సెప్టెంబరు 30 – 2022 అక్టోబరు 2 మధ్య కాలంలో దవాఖానలో చికిత్స పొందారు. దీని కోసం రూ.48,872 ఖర్చు చేశారు. ఈ సొమ్మును భర్తీ చేయాలని బీమా కంపెనీని కోరారు. దీనిపై కంపెనీ స్పందిస్తూ, ఆయన 27 ఏండ్ల నుంచి డయాబెటిస్ మెలిటస్తో బాధపడుతున్నారని, ఇది అందరికీ తెలిసిన డయాబెటిస్ కేసు అని చెప్తూ, చికిత్స ఖర్చులను భర్తీ చేసేందుకు తిరస్కరించింది. దీంతో రాజీవ జిల్లా వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కమిషన్ పై విధంగా తీర్పు చెప్పింది.