న్యూఢిల్లీ, మే 22: తౌటే తుఫాన్ విరుచుకుపడి వారం కాకముందే మళ్లీ ఓ కొత్త తుఫాన్ ముంచుకొస్తోంది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 26న ఉదయానికల్లా అతి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం హెచ్చరించింది. అల్పపీడనం ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత అది ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ సోమవారానికి తీవ్ర తుఫానుగా, తర్వాత అతి తీవ్ర తుఫాన్గా మారుతుందని పేర్కొన్నది. దీనికి ‘యాస్’ అని పేరు పెట్టారు. ఈ పేరును ఒమాన్ దేశం సూచించింది. బుధవారం ఉదయం తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ప్రాంతీయ వాతావరణ విభాగం(ఆర్ఎంసీ) డైరెక్టర్ జీకే దాస్ చెప్పారు. ఆదివారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జాలర్లు ఎవరూ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో మంగళవారం నుంచి బెంగాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బుధ, గురువారాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.